● 330 కేంద్రాల పెంపునకు ఎన్నికల కమిషన్ ఆమోదం
● 48 పీఎస్ల ప్రదేశాల మార్పు, 7 పీఎస్ల పేరు మార్పు
అనంతపురం అర్బన్: జిల్లాలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను ఎన్నికల కమిషన్ ఆమోదించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆనంద్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం వెల్లడించారు. హేతుబద్ధీకరణ ద్వారా ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో మరో 330 కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 2,226 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కొత్త వాటితో పోలింగ్ కేంద్రాల సంఖ్య 2,556కు చేరింది. అత్యధికంగా గుంతకల్లు నియోజకవర్గంలో 71 కేంద్రాలు పెరగగా.. అత్యల్పంగా శింగనమల, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో 21 చొప్పున పెరిగాయి. అదే క్రమంలో రాయదుర్గం నియోజకవర్గంలో 3, ఉరవకొండలో ఒకటి, శింగనమలలో 10, అనంతపురం అర్బన్లో 30, కళ్యాణదుర్గంలో ఒకటి, రాప్తాడు నియోజవర్గంలో 3 కేంద్రాలు మొత్తం 48 పోలింగ్ కేంద్రాల ప్రదేశాలు మారనున్నాయి. ఇక రాయదుర్గం నియోజకవర్గంలో 2, అనంతపురం అర్బన్లో 2, కళ్యాణదుర్గం నియోజక వర్గంలో 3 కేంద్రాల పేరు మార్పు చేయనున్నారు.
పెరిగాయి ఇలా..
రాయదుర్గం నియోజకవర్గంలో 47, ఉరవకొండలో 26, గుంతకల్లులో 71, తాడిపత్రిలో 47, శింగనమలలో 21, అనంతపురం అర్బన్లో 70, కళ్యాణదుర్గంలో 21, రాప్తాడులో 27 చొప్పున పోలింగ్ కేంద్రాలు పెరిగాయి.
కేంద్రానికి 1,200 ఓట్లు
ఒక పోలింగ్ కేంద్రానికి ఇప్పటి వరకు గరిష్టంగా 1,500 ఓట్లు ఉండేవి. అంతకు మించి ఓట్లు ఉంటే యాగ్జిలరీ కేంద్రం ఏర్పాటు చేసేవారు. ఎన్నికల కమిషన్ ఈ క్రమాన్ని మార్పు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఒక పోలింగ్ కేంద్రంలో 1,200 ఓట్లు మించరాదు.


