గుంతకల్లుటౌన్: పట్టణంలోని శ్రీరామ్ ఫైనాన్స్ ఉద్యోగులపై చీటింగ్ కేసు నమోదైంది. వన్టౌన్ సీఐ మనోహర్ తెలిపిన మేరకు.. గుంతకల్లు తిలక్నగర్కు చెందిన సుంకన్న ఎఫ్సీఐ గోడౌన్ వద్ద ఉన్న తన 144 గజాల స్థలాన్ని స్థానిక శ్రీరామ్ ఫైనాన్స్లో 2024 మార్చి 10న తాకట్టు పెట్టి రూ.15 లక్షల రుణం పొందాడు. 10 నెలల పాటు కంపెనీ నిర్ణయించిన మేర ఈఎంఐలు చెల్లించాడు. వడ్డీలు అధికంగా విధిస్తున్నారని భావించిన సుంకన్న తన వద్దనున్న రూ.8 లక్షలను అదే ఏడాది డిసెంబర్ 10న చెల్లించి ముందస్తుగానే రుణాన్ని పూర్తి చేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే మేనేజర్ నరసింహులు, ఉద్యోగి ప్రభాకర్లు రూ.8 లక్షలను వారి సన్నిహితుడైన రాయలచెరువు వెంకటరావు బ్యాంకు ఖాతాలో జమ చేయించారు. రెండు నెలల తరువాత ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్లి తాను తాకట్టు పెట్టిన పత్రాలు తిరిగి ఇవ్వాలని సుంకన్న కోరగా డొంకతిరుగుడు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో సోమవారం సుంకన్న దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేనేజర్ నరసింహులు, ఉద్యోగి ప్రభాకర్, రాయలచెరువు వెంకటరావుపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
‘ఐఫియా’ జాతీయ కమిటీలో
జిల్లావాసులకు చోటు
అనంతపురం ఎడ్యుకేషన్: అఖిల భారత విద్యా ఉద్యోగుల సమాఖ్య (ఐఫియా) జాతీయ కమిటీలో అనంతపురం జిల్లాకు ప్రాధాన్యత లభించింది. ఉపాధ్యాయ నాయకులు కె. వెంకటరెడ్డి జాతీయ ఉపాధ్యక్షుడిగా, కేహెచ్వీ సత్యప్రసాద్ జాతీయ శాశ్వత సభ్యుడిగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) జిల్లా శాఖ హర్షం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణతో పాటు ప్రభుత్వ విద్యాభివృద్ధి కోసం వారు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగానే ఈ కీలక బాధ్యతలు అప్పజెప్పారని జిల్లా శాఖ పేర్కొంది. జాతీయ స్థాయిలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి వారు మరింత సమర్థవంతంగా కృషి చేస్తారని ఆకాంక్షించింది.


