ఉరవకొండ రూరల్: చంద్రబాబు పాలనలో రైతాంగం కుదేలైందని ఎమ్మెల్సీ వై.శివరామి రెడ్డి మండిపడ్డారు. ఖరీఫ్–2024 ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మూడు రోజుల నుంచి ఇన్సూరెన్సు మొత్తం రైతుల ఖాతాల్లో జమ కావడానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గిట్టుబాటు ధర లేక టమాట పంటను రైతులు రోడ్లలో పడేస్తున్నారన్నారు. ధరలను దళారులు అమాంతం తగ్గించి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధిని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తివేయడం అసమర్థతకు నిదర్శనమన్నారు. ఉచిత పంటల బీమాను రద్దు చేసి గత ఏడాది ఇన్సూరెన్స్ చెల్లించకపోవడంతో రైతులకు బీమా డబ్బు అందని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రైతులకు చేదోడువాదోడుగా ఉన్న ఆర్బీకే తదితర వ్యవస్థలను కనుమరుగు చేశారని దుయ్యబట్టారు. తీవ్ర కరవుతో రైతులు అల్లాడిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయిందని, స్వార్థ రాజకీయాలకే కూటమి నేతలు పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు.
ఎమ్మెల్సీ వై.శివరామి రెడ్డి


