ఈ–స్టాంప్ కేసు
హైకోర్టులో నేడు విచారణ
కళ్యాణదుర్గం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కళ్యాణదుర్గం ఈ– స్టాంప్ కుంభకోణం కేసు బుధవారం హైకోర్టులో విచారణకు రానుంది. మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య ఈ– స్టాంప్ కుంభకోణంపై హైకోర్టులో 2025 నవంబర్ 17న ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆ కేసు అడ్మిషన్ స్టేజ్లో ఉంది. కేసును హైకోర్టు డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు ధీరజ్సింగ్ ఠాకూర్, చల్లా గుణరంజన్ విచారించనున్నారు. పిటిషనర్ డాక్టర్ తలారి రంగయ్య ఈ కేసులో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలు, హోం శాఖ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ది సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ), కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ను చేర్చారు. ఈ కేసు 2025 నవంబర్ 19న, 2026 ఫిబ్రవరి 18న, 2026 మార్చి 11న విచారణకు వచ్చింది. తాజాగా మరోమారు విచారణకు రావడంతో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో గుబులు పుడుతోంది. కాగా పిటిషనర్ తరఫున సీనియర్ కౌన్సిల్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించనున్నారు. అయితే ఇప్పటికే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తన న్యాయవాదులతో కేసును ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై సమాలోచనలు చేసినట్లు సమాచారం.
అదనపు ఎస్పీగా నాగభూషణం
అనంతపురం సెంట్రల్: అదనపు ఎస్పీగా నాగభూషణం నియమితులయ్యారు. జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ డీఎస్పీగా పనిచేస్తున్న ఆయనకు ఇటీవల అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించారు. తాజాగా అనంతపురం అదనపు ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


