అనంతపురం అగ్రికల్చర్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. మూడు రోజులుగా చాలా మండలాల్లో మోస్తరుగా కురిశాయి. ఆదివారం తెల్లవారుజామున 28 మండలాల పరిధిలో 26.7 మి.మీ మేర సగటు వర్షపాతం నమోదైంది. రాప్తాడు మండలంలో ఏకంగా 102.2 మి.మీ కుండపోత వర్షం కురిసింది. యాడికి 63.4 మి.మీ, అనంతపురం రూరల్ 62.4, అనంతపురం అర్బన్ 60.2, పామిడి 55.4, తాడిపత్రి 52.4, కూడేరు 52 మి.మీ భారీ వర్షం కురిసింది. గార్లదిన్నె 44.8 మి.మీ, గుంతకల్లు 42.4, విడపనకల్లు 40.2, బుక్కరాయసముద్రం 40.2, పెద్దవడుగూరు 39, ఉరవకొండ 35.2, వజ్రకరూరు 29.2, గుత్తి 26.8, నార్పల 19.6 మి.మీ తోపాటు మరికొన్ని మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. కాగా జూన్ నెల సాధారణ వర్షపాతం 61.2 మి.మీ కాగా ఇప్పటికే 69.1 మి.మీ నమోదైంది. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో చెక్డ్యాంలు, చిన్నపాటి వంకలు ప్రవహిస్తున్నాయి. రాయదుర్గం, కళ్యాణదుర్గం డివిజన్ల పరిధిలో వర్షాలు తక్కువగా నమోదు కాగా మిగతా మండలాల్లో పదను వర్షం కురవడంతో ఖరీఫ్ సాగు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
28 మండలాల్లో 26.7 మి.మీ
సగటు వర్షపాతం నమోదు


