సరుకుల కోసం స్టోర్ వద్ద కార్డుదారుల క్యూ (ఫైల్)
అనంతపురం అర్బన్/ రాయదుర్గం టౌన్/ ఉరవకొండ: పేదల జీవితాలతో చంద్రబాబు సర్కార్ ఆడుకుంటోంది. అరకొర సంపాదనతో బతుకులీడుస్తున్న వారికి ప్రభుత్వం చౌకగా అందించే సరుకులను కుదిస్తోంది. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించే విధానాన్ని రద్దు చేసింది. దీంతో కార్డుదారులు సరుకులు పొందాలంటే పాత పద్ధతిలో చౌకదుకాణాలు (స్టోర్ల)కు వెళ్లి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు తీసుకొచ్చింది. ప్రస్తుతం కందిపప్పు, గోధుమపిండి, జొన్నలు, రాగులు అటకెక్కించేసి బియ్యం, పంచదార (చక్కెర) వరకే పరిమితం చేసింది. దీంతో పేదలు బయటి మార్కెట్లో ఆ సరుకులను అధిక ధరలు వెచ్చించి కొనాల్సి వస్తోంది.
బెంబేలెత్తిస్తున్న ధరలు
నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. దీనికితోడు ఇంధన ధరల పెంచడంతో అన్ని రకాల వస్తువులపై మరింత భారం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం చౌక డిపోల ద్వారా సబ్సిడీపై నిత్యవసరాలు సరఫరా చేస్తే పేదలకు ఎంతో చేయూతగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకపోవడం పట్ల ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది.
పేదలపై ప్రతి నెలా రూ.10.23 కోట్ల భారం
ప్రభుత్వం కార్డుదారులకు జొన్నలు, రాగులు పంపిణీ చేయకపోవడంతో బయటి మార్కెట్లో వాటిని పేదలు కొనుగోలు చేయక తప్పడం లేదు. మార్కెట్లో జొన్నలు కిలో రూ.50, రాగులు కిలో రూ.50తో కొనుగోలు చేస్తున్నారు. ప్రతి కుటుంబం నెలసరి రెండు కిలోల జొన్నలు, ఒక కిలో రాగులు తప్పనిసరిగా కొనుగోలు చేస్తారు. తద్వారా 6.82 లక్షల మంది కార్డుదారులు కిలో జొన్నలు రూ.50 చొప్పున ప్రతి నెల రెండు కిలోల జొన్నలకు రూ.6.82 కోట్లు, ఒక కిలో రాగులకు రూ.3.41 కోట్లు వెచ్చిస్తున్నారు. ప్రభుత్వం జొన్నలు, రాగులు పంపిణీ చేయకపోవడంతో పేదలు ప్రతి నెలా రూ.10.23 కోట్ల అదనపు భారం భరిస్తున్నారు.
ఉడకని కందిపప్పు
పౌరసరఫరాల సంస్థ ద్వారా పేదలకు అందజేసే నిత్యావసర సరుకులు రానురానూ తగ్గిపోతున్నాయి. వాస్తవానికి బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార పంపిణీ చేయాలి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కందిపప్పు సరఫరాను నిలిపేసింది. ఎప్పటికప్పుడు ఈసారి కందిపప్పు ఇస్తున్నాం అంటూ పాలకులు ప్రచారం చేయడం తప్ప పేదలకు పంపిణీ చేసింది లేదు. ప్రైవేట్ దుకాణాల్లో కిలో కందిపప్పు రూ.130 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు.
కందిపప్పు, జొన్నలు, గోధుమపిండి కట్
తాజాగా రాగుల పంపిణీకి బ్రేక్ వేసిన సర్కార్
బయట కొనుగోలుతో పేదలపై మోయలేని భారం
చంద్రబాబు పాలనలో సరుకుల కోతలు.. ధరల మోతతో జనం కుదేలు


