అనంతపురం ఎడ్యుకేషన్: చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ–25 పేరుతో దగా డీఎస్సీ నిర్వహించి నిరుద్యోగులను నిలువునా ముంచిందని వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి యువకులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, అర్హతలేని వారికి ఉద్యోగాల కేటాయింపు, పేపర్ లీకేజీ ఆరోపణలు, ఫేక్ సర్టిఫికెట్లతో ఎంపికలు జరిగినట్లు వచ్చిన అభియోగాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇన్చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్కు వినతిపత్రం అందజేశారు.
లోకేష్ను బర్తరఫ్ చేయాలి..
ఎన్నికల ముందు 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి.. తీరా 16 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారని, డీఎస్సీ నిర్వహణలోనూ అక్రమాలకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువత పట్ల చంద్రబాబు ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరించిందన్నారు. లక్షలాది రూపాయలకు పోస్టులు అమ్ముకున్నారని మండిపడ్డారు. దేశంలో ఏ పరీక్షలు జరిగినా మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారని, కానీ ఏపీలో మాత్రం డీఎస్సీ పరీక్షలకు సంబంధించి మెరిట్ జాబితా ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. సీఎం చంద్రబాబుకు నిజాయితీ ఉంటే తక్షణం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను బర్తరఫ్ చేసి సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
విద్యాశాఖ మంత్రి చేతగాని దద్దమ్మ..
రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి చేతగాని దద్దమ్మ అని యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ మండిపడ్డారు. డీఎస్సీలో అక్రమాలకు పాల్పడి యువత ఆశలపై నీళ్లు చల్లారన్నారు. ఎన్నికలకు ముందు ‘యువగళం’ కార్యక్రమంలో నారా లోకేష్ అనేక హామీలు ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక యువతను అడుగడుగునా మోసం చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి హోదాలో నారా లోకేష్ ఇద్దరూ డీఎస్సీపై తొలి సంతకం చేశారని, అయితే పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని విరుచుకుపడ్డారు. కార్యక్రమంలో మాజీ మేయర్ వసీం, వైఎస్సార్సీపీ నేతలు అనంత చంద్రారెడ్డి, కొండ్రెడ్డి ప్రకాష్రెడ్డి, వీరాంజనేయులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌస్ బేగ్, యూత్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉమ్మడి మదన్మోహన్రెడ్డి, రామాంజి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్లుట్ల మారుతీనాయుడు, గుంతకల్లు అధ్యక్షుడు అబ్దుల్ బషీద్, కళ్యాణదుర్గం అధ్యక్షుడు తలారి చరణ్, శింగనమల అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, ఉరవకొండ అధ్యక్షుడు బసవనగౌడ్, అనంతపురం అధ్యక్షుడు శ్రీనివాస్ గురుదత్త, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, నాయకులు ఓబిరెడ్డి, సైఫుల్లా బేగ్, మల్లెమీద నరసింహులు, రాజేష్రెడ్డి, దాదా ఖలందర్, లోకనాథ్రెడ్డి, సాకే చిరంజీవి, గుజ్జల శివయ్య, అమర్నాథ్రెడ్డి, కొండ్రెడ్డి ఓబిరెడ్డి, వెన్నం శివారెడ్డి, ఇసాక్, రమణారెడ్డి, సంపంగి రామాంజినేయులు, కై లాష్, అమ్మవారిపేట శ్రీకాంత్, సతీష్, శ్యాం పాల్గొన్నారు.
డీఎస్సీ అక్రమాలపై యువకులు, నిరుద్యోగుల మండిపాటు
కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆందోళన


