● 1,369 గృహాలకు తాళం,
84,301 గృహాలు ఖాళీ
● గణన మరోవారం పెంచే అవకాశం
అనంతపురం అర్బన్: జనగణన–2027లో భాగంగా చేపట్టిన తొలిదశ గృహగణన కార్యక్రమం జిల్లావ్యాప్తంగా మే 30తో ముగిసింది. 32 మండలాలు, నగరపాలక సంస్థ, ఐదు పురపాలక సంఘాల పరిధిలో 7,41,014 గృహాలు ఉన్నాయి. వీటిలో 5,47,438 గృహాల్లో నివాసముంటున్నారు. వీటిలో గడువు ముగిసే నాటికి 5,02,493 గృహాల గణన (91.789 శాతం) పూర్తి చేశారు. 44,945 గృహాలు సర్వే చేయాల్సి ఉంది. అయితే గృహగణన వందశాతం పూర్తికానందున కార్యక్రమాన్ని సెన్సస్ శాఖ మరో వారం రోజులు పెంచే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు రావచ్చని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.
84 వేల ఇళ్లు ఖాళీ..
అధికారిక గణాంకాల ప్రకారం జిల్లావ్యాప్తంగా ఉన్న 7,41,014 గృహాలలో 84,301 గృహాలు ఖాళీగా ఉన్నాయి. 1,369 గృహాలు తాళం వేసి ఉన్నాయి. ఇక 1,07,906 గృహాలను ఇతర పనులకు వినియోగిస్తున్నారు. 5,47,438 నివాస గృహాల్లో 5,02,493 గృహాలను లెక్కించారు. ఇకజిల్లాలో మొత్తం జనాభా 22,11,143 మంది ఉన్నారు.


