అనంతపురం ఎడ్యుకేషన్: మాదిగ విద్యార్థులు బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పేర్కొన్నారు. పదో తరగతి ఫలితాల్లో 500కు పైగా మార్కులు సాధించిన మాదిగ విద్యార్థులకు మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం ‘పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ప్రతిభా పురస్కారాలు’ పంపిణీ చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు మన్నెపాకుల రమేష్ అధ్యక్షతన వహించారు. ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, బండారు శ్రావణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఎస్ రాజు, బండారు శ్రావణి మాట్లాడుతూ పేద విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యురాలు ఎన్టీ రామాంజినమ్మ, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ బేకరీ గంగాధర్, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు, రాష్ట్ర అధ్యక్షులు సురేష్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్, మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వై.కే. విశ్వనాథ్, మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి బిక్షాలు తదితరులు పాల్గొన్నారు.


