రాయదుర్గంటౌన్: పట్టణ శివారు గౌడ లేఅవుట్ జగనన్న కాలనీ సమీపంలోని 169 సర్వే నంబర్లో ఓ రైతు భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిగాయి. ఆదివారం ఉదయం నుంచి జేసీబీలు, టిప్పర్లతో రైల్వే పనుల కోసం పట్టణానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు దగ్గరుండి మట్టి తరలిస్తున్నాడు. విషయం తెలుసుకున్న సదరు రైతు బంధువులతో పాటు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బంగి శివ మట్టి తరలిస్తున్న వారిని అడ్డుకొని నిలదీశారు. దాదాపు 70 దాకా టిప్పర్ల మట్టిని తరలించి భూమిని గుంతలమయం చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు టీడీపీ నాయకుల అండదండలు ఉన్నాయని, ఎవరూ ఏమీ చేయలేరని బెదిరిస్తున్నట్లు బంగి శివ తెలిపారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు.


