ఉరవకొండ: బక్రీద్ పండుగ నేపథ్యంలో కూడేరులోని పీఏబీఆర్ వద్దకు చేరుకున్న కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అనంతపురం నగరంలోని ఆజాద్ నగర్కు చెందిన ఓ కుటుంబం శనివారం పీఏబీఆర్కు చేరుకుంది. తొమ్మిది మంది కుటుంబసభ్యులు కలసి విందు భోజనాలు చేసిన అనంతరం షేక్ ఫరీదా(35), ఆమె సోదరి కుమార్తె యాస్మిన్(13) సరదాగా జలాశయం చివరన నీటిలోకి దిగారు. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లి గల్లంతయ్యారు. కుటుంబ సభ్యులు గుర్తించి వెలికి తీసేలోపు విగత జీవులయ్యారు. పోలీసులు వచ్చి స్థానికుల సాయంతో మృతదేహాలను వెలికి తీశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


