గుమ్మఘట్ట: బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... రాయదుర్గం నివాసి రిజ్వాన్ (32) శుక్రవారం వ్యక్తిగత పనిపై గుమ్మఘట్ట మండలం గోనబావికి వచ్చాడు. పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన... 75 వీరాపురం గ్రామం దాటిన తర్వాత ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన బొలెరో ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడిన రిజ్వాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై ఎస్ఐ చిన్నరాయుడు దర్యాప్తు చేపట్టారు.
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉద్యోగావకాశాలు
అనంతపురం: ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు బెంగళూరులో ఉచితంగా ట్యాలీ, కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు అడ్మిషన్ల కో–ఆర్డినేటర్ హరిప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 35 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణా కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ పాస్/ఫెయిల్ అయిన వారు అర్హులు. పూర్తి వివరాలకు 90004 87423 లో సంప్రదించవచ్చు.


