● జిల్లాలో 248 మంది ‘ప్రత్యేక పిల్లల’ గుర్తింపు
● రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచిన ‘అనంత’
అనంతపురం ఎడ్యుకేషన్: చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల వైకల్యాన్ని బయటపెట్టడానికి ఇప్పటికీ వెనుకడుగు వేస్తున్నారు. ‘సమాజం ఏమనుకుంటుందో?’, ‘మా పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందేమో?’ అనే భయాలు వారిలో కనిపిస్తున్నాయి. అయితే నేటి సమాజంలో పరిస్థితులు మారుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలను ప్రభుత్వం మాత్రమే కాదు సమాజం కూడా ఆదరించే దిశగా ముందుకు సాగుతోందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో సమగ్రశిక్ష ద్వారా ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో ప్రత్యేక అవసరాల పిల్లల (సీడబ్ల్యూఎస్ఎన్) ప్రత్యేక నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి మండలంలో ఐఈఆర్పీలు ఇంటింటికీ వెళ్లి పిల్లల వివరాలు సేకరిస్తూ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటిదాకా జిల్లాలో 1,318 మందిని గుర్తించగా.. వీరిలో 396 మంది కొత్త పిల్లలు ఉన్నారు. మంగళవారం నాటికి మన జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. మే 4న ప్రారంభమైన ఈ ‘స్పెషల్ డ్రైవ్’ జూన్ 10 దాకా కొనసాగనుంది.
నమోదు చేస్తేనే పథకాలు
ప్రత్యేక అవసరాల పిల్లల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తే ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు వారికి చేరువవుతాయి.
అర్హులను గుర్తించడమే లక్ష్యం
ప్రత్యేక అవసరాల పిల్లల గుర్తింపునకు చేపడుతున్న ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమని సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, ఐఈ కోఆర్డినేటర్ ఫణిరాజ్ తెలిపారు.


