వెంటాడి.. వేటాడి | - | Sakshi
Sakshi News home page

వెంటాడి.. వేటాడి

May 27 2026 10:26 AM | Updated on May 27 2026 10:26 AM

బత్తలపల్లి: సినిమాలో గూండాలను పట్టుకునేందుకు పోలీసులు ఛేజింగ్‌ చేసే సీన్లను తలపించేలా పులివెందుల నుంచి బత్తలపల్లి వరకు మంగళవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై సుమారు 60 కిలోమీటర్ల మేర పందుల దొంగల వేట ఉత్కంఠను రేపింది. గత రెండేళ్లుగా వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలో గుర్తు తెలియని వ్యక్తులు పందుల దొంగతనాలు చేస్తూ కలకలం రేపుతుండగా.. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘటనతో దొంగల ముఠా గుట్టు రట్టయ్యింది. ప్రత్యక్ష సాక్షులు, బత్తలపల్లి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు... పులివెందుల వాసి అంజినప్పకు సంబంధించిన పందులను గత రెండేళ్లుగా గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడప్పుడు అపహరించుకుని పోతున్నారు. సీసీ కెమెరాల్లో, ఇతరత్రా పరిశీలించినప్పుడు వాహనాలకు నెంబర్‌ లేకపోవడంతో వారిని గుర్తించడం కష్టమైంది. అయితే.. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అంజినప్పకు చెందిన పందులను బొలెరో వాహనంలో ఎక్కించి తరలిస్తుండగా, యజమాని బంధువైన ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ అనుమానాస్పదంగా ఉన్న ఆ వాహనాన్ని గుర్తించారు. వెంటనే ఆయన అంజినప్పకు సమాచారం అందించారు. అంజినప్ప తక్షణమే పులివెందుల పోలీసులకు తెలియజేశాడు. దీంతో అంజినప్ప, పోలీసులు వేర్వేరుగా దొంగలను వెంబడించారు.

దాడులు చేస్తూ తప్పించుకునే యత్నం

తమను వెంబడిస్తున్న వాహనాలపైకి దొంగలు రాళ్లతోనూ, బీరు సీసాలతోనూ దాడులకు దిగారు. అప్పుడప్పుడు పందులను ఆ వాహనాలపైకి వేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అంజినప్ప బంధువైన పులివెందుల కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. మార్గమధ్యంలోని ముదిగుబ్బ మండలం దొరిగిల్లు వద్ద ఎదురుపడ్డ రెండు ద్విచక్ర వాహనాలను సైతం పందుల దొంగల వాహనం ఢీ కొట్టినట్లు సమాచారం. ముదిగుబ్బ వైపునకు దొంగల వాహనం వెళుతుండడంతో అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముదిగుబ్బ వద్ద కూడా పోలీసుల కళ్లుగప్పి దొంగలు బైపాస్‌ మీదుగా బత్తలపల్లి వైపు పరారయ్యారు. దీంతో ముదిగుబ్బ సీఐ శివరాముడు వెంటనే ధర్మవరం రూరల్‌ సీఐ ప్రభాకర్‌గౌడుకు సమాచారం ఇచ్చారు. ఆయన బత్తలపల్లి ఎస్‌ఐ సోమశేఖర్‌, పోలీసులను అప్రమత్తం చేశారు. సిబ్బందితో కలిసి ఎస్‌ఐ టోల్‌గేట్‌ వద్ద కాపు కాశారు. అయితే ఈ విషయాన్ని ముందే పసిగట్టిన దొంగలు జాతీయ రహదారి వదిలేసి గుమ్మల్లకుంట ఎస్సీ కాలనీ మార్గంలో గంటాపురం గ్రామంలోకి వెళ్లి, అక్కడి నుంచి బైపాస్‌కు చేరుకున్నారు. వెంబడిస్తున్న పోలీసులు బత్తలపల్లి పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు గంటాపురం వద్దకు చేరుకున్నారు. ఆలోపు బైపాస్‌ చేరుకున్న దొంగల వాహనం ఎలాగైనా తప్పించుకునే అవకాశముందని భావించిన యజమాని అంజినప్ప ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు.

దొంగలు వాడిన బొలెరో వాహనం, ఛేజింగ్‌ చేసే క్రమంలో దెబ్బతిన్న పందుల యజమాని కారు

బైపాస్‌లో సర్వీసు రోడ్డులో వెళ్తున్న దొంగల వాహనాన్ని యజమాని అంజినప్ప తన కారుతో ఓవర్‌టేక్‌ చేసి అడ్డంగా నిలిపాడు. దీంతో బొలెరో వాహనం అంజినప్ప కారును బలంగా ఢీ కొట్టి రోడ్డు పక్కనున్న డ్రైనేజీని ఎగిరి అదుపుతప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. బొలెరో ముందు చక్రాలు ఊడిపోయాయి. పందుల యజమాని కారు నుజ్జునుజ్జు అయింది. వాహనాలు ఆగిన వెంటనే దొంగలు రాళ్ల దాడికి దిగారు. యజమాని వైపు నుంచి సైతం ప్రతిఘటించారు. ఇరువర్గాల వారికి గాయాలయ్యాయి. ఇంతలోనే బత్తలపల్లి, పులివెందుల పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఏడుగురు దొంగలు తప్పించుకుని పారిపోయారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దొంగల ముఠాలోని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు పందులను పులివెందుల పోలీసులకు అప్పగించారు. ఇరువురి వాహనాలను బత్తలపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పరారైన దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ ఆరా తీశారు. ధైర్యసాహసాలతో విధులు నిర్వర్తించిన ముదిగుబ్బ, బత్తలపల్లి పోలీసులను అభినందించారు. దొంగలు అనంతపురానికి చెందిన వారుగా గుర్తించారు.

ఓవర్‌టేక్‌ చేసి..అడ్డంగా నిలిపి

పందుల దొంగల కోసం సినీ ఫక్కీలో వేట

పులివెందుల నుంచి బత్తలపల్లి వరకు కొనసాగిన ఛేజింగ్‌

యజమాని సాహసం.. పోలీసుల చాకచక్యం

ఏడుగురు దొంగల పరారీ.. ఒకరిని బంధించిన పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement