రాయదుర్గంటౌన్: రాయలేలిన రాయదుర్గంలో అడుగడుగునా శిల్పకళా సంపద ఉట్టి పడేలా అనేక ఆలయాలు ఉన్నాయి. విజయనగర రాజుల కాలంలో రాయదుర్గం ప్రాంతాన్ని మహామంత్రి తిమ్మరుసు తమ్ముడు గోవిందామాత్యుడు పాలించినట్లు ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆ కాలంలో నిర్మించిన ఆలయాలు నేటికీ చెక్కుచెదరలేదు. కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి ఆలయం, జంభుకేశ్వరస్వామి, దశభుజ గణపతి, పాదరస శివలింగం, పశుపతినాథ ఆలయాలతో పాటు లక్ష్మమ్మ సమాధి, కొండపై లక్ష్మీనరసింహస్వామి, కోదండరామస్వామి, మాధవరాయస్వామి, రససిద్దేశ్వరస్వామి ఆలయాలతోపాటు ఇతర కట్టడాలు చూడమనోహరంగా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి రాయదుర్గం పట్టణానికి ప్రతి అరగంటకు ఒక ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. అలాగే ఉరవకొండ నుంచి 60 కిలోమీటర్లు, కళ్యాణదుర్గం నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. పట్టణానికి చేరుకుంటే కొండ సమీపంలోనే ఉంటుంది. కాలినడన వెళ్లాల్సి ఉంటుంది.


