గార్లదిన్నె: మండలంలోని ఎగువపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై లారీ ఢీకొన్న ఘటనలో అదే గ్రామానికి చెందిన రైతు పెద్ద ఓబయ్య (80) మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. జాతీయ రహదారికి అవతలి వైపు ఉన్న తన పొలానికి రోజూ కాలి నడకన వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం పొలానికి వెళ్లిన ఓబయ్య... అక్కడ పని ముగించుకుని ఇంటికి వెళుతూ.. జాతీయ రహదారిపై రైస్ మిల్లు వద్ద రోడ్డు దాటుతుండగా గుత్తి వైపుగా వెళుతున్న హర్యానాకు చెందిన లారీ ఢీకొంది. పెద్ద ఓబయ్యకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా దూసుకెళ్లిపోయాడు. గమనించిన స్థానికులు 108 ద్వారా అనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. లారీ ఆచూకీ కోసం గాలిస్తుండగా కాశేపల్లి టోల్ ప్లాజా వద్ద ఆపి డ్రైవర్ పరారైనట్లుగా గుర్తించారు. లారీని స్వాధీనం చేసుకుని పీఎస్కు తరలించారు. ఘటనపై ,కేసు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


