● 40 కిలోల బస్తా రూ.7 వేల నుంచి రూ.2వేలకు డౌన్
తాడిపత్రిటౌన్: ఆకాశాన్నంటిన నిమ్మ ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. 40 కిలోల నిమ్మ బస్తా రూ.7 వేలు ఉండేది. పది రోజుల వ్యవధిలో రూ.2వేలకు పడిపోయింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని తాడిపత్రి, యాడికి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు మండలాల్లో దాదాపు 2,500 ఎకరాల విస్తీర్ణంలో నిమ్మ సాగులో ఉంది. దీర్ఘకాలిక పంట కావడంతో రైతులు రూ.లక్షలు ఖర్చు చేసి సాగు చేశారు. అయితే మార్కెట్లో ఒక్కసారిగా ధరలు పతనం కావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కనీసం కోత కోసిన కూలీలకు, ఆటో బాడుగలకు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి బోరుబావుల్లో నీరు రాకపోతే ట్యాంకరు నీరు రూ.700 చొప్పున వెచ్చించి చెట్లను కాపాడుకున్నారు. ఇప్పుడు మార్కెట్లో నిమ్మ ధరలు పతనం కావడంతో అప్పులు తీర్చేదారి కానరావడం లేదంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. నిమ్మకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వమే కోరుతున్నారు.


