గుత్తి రూరల్: మండలంలోని వన్నేదొడ్డి గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఇన్నోవా కారు టైరు పగలడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఏఎస్ఐ నూర్ మహ్మద్ వివరాలమేరకు.. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరానికి చెందిన మహమ్మద్ సిరాజ్ కుమారుడు లుక్మాన్ బీజాపూర్లో ఎంబీబీఎస్ పూర్తి చేయడంతో గ్రాడ్యుయేషన్ వేడుకకు కుటుంబ సభ్యులు అందరూ కలిసి అక్కడికి వెళ్లారు. తిరిగి కారులో బెంగళూరు బయలుదేరారు. వన్నేదొడ్డి గ్రామ శివారు దగ్గర కారు ముందు టైరు ఒక్కసారిగా పేలింది. కారు అదుపు తప్పగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డుగా బోల్తా పడింది. ఘటనలో మహమ్మద్ సిరాజ్, అబ్దుల్ ఖాదర్, లుక్మాన్, జోహా, అర్షియా, ఆరిఫ్ బాష, మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీసి వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉండటంతో అర్షియా, ఆరీఫ్ బాషాలను అనంతపురంకు తరలించి అక్కడి నుంచి బెంగళూరుకు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దెబ్బతిన్న కారు, తీవ్రంగా గాయపడిన అర్షియా, ఆరిఫ్ బాషా


