ఆదరణ పొందుతున్న అగ్రి కోర్సులు | - | Sakshi
Sakshi News home page

ఆదరణ పొందుతున్న అగ్రి కోర్సులు

May 24 2026 12:51 AM | Updated on May 24 2026 12:51 AM

తక్కువ ఫీజులకే వ్యవసాయ విద్య

బుక్కరాయసముద్రం: తక్కువ ఖర్చుతో విశేష ఆదరణ ఉన్న వ్యవసాయ విద్యను అభ్యసించడం ద్వారా త్వరగా ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. 10 తరగతి పూర్తి చేసిన విద్యార్థులు తర్వాత ఇంటర్‌ చేసి డిగ్రీలు, పీజీ, బీఈడీ, బీటెక్‌ కోర్సులంటూ చదివి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడేకంటే వ్యవసాయ పాలిటెక్నిక్‌ కోర్సులు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. 2 ఏళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేస్తే మరో 2 ఏళ్లలో ఉద్యోగాలు పొందడానికి చాలా మార్గాలున్నాయని నిపుణులు అంటున్నారు. జిల్లాలో రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల ఉంది. అదే విధంగా మడకశిరలో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల ఉంది. వీటితో పాటు అనంతపురం, కదిరి, తాడిపత్రి పట్టణాలలో ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ఎస్సీలకు 15 శాతం సీట్లు, ఎస్టీలకు 6 శాతం, బాలికలకు 33 శాతం సీట్లు, అంగవైకల్యం కలిగిన వారికి 3 శాతం సీట్లు కేటాయించారు. మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు.

కావలసిన విద్యార్హతలు

అగ్రికల్చర్‌ కోర్సులు చదవడానికి పెద్ద విద్యా అర్హతలతో పని లేదు. వీటిలో ప్రవేశానికి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉంటే చాలు. వ్యవసాయ పాలిటెక్నిక్‌ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్‌లైన్‌ ద్వారా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హులను ఎంపిక చేస్తారు. వయస్సు 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఇప్పటికే వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, హర్టికల్చర్‌ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్‌ వెలువడింది. దరఖాస్తులను www.angrau.ac.in వెబ్‌సైట్‌ ద్వారా అందజేయాలి. పూర్తి సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

Advertisement
 
Advertisement
Advertisement