● వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి
అనంతపురం: మహిళా సాధికారితకు ఆద్యుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి కొనియాడారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. డ్వాక్రా రుణాల మాఫీ, అమ్మ ఒడి వంటి పథకాలతో మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. ప్రజాదరణ పొందిన జగన్ ప్రభుత్వ పథకాలు అమలు చేయకుండా నలుగురు బిడ్డల్ని కనండి.. రూ.30 వేలు ఇస్తామంటూ సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటివి తొలుత ఆయన ఇంటి నుంచే మొదలు పెడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు రూ.1,500 ఇస్తామన్న హామీని గాలికొదిలేశారని విమర్శించారు. సవాలక్ష నిబంధనలతో సీ్త్ర శక్తి పథకాన్ని కొన్ని బస్సులకే పరిమితం చేశారన్నారు. కొత్త బస్సులు కొనుగోలు చేయకపోవడంతో.. ఉన్న బస్సుల్లోనే మహిళలు ఇబ్బందికరంగా ప్రయాణం చేయాల్సి వస్తోందన్నారు. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామన్న హామీని తొలి ఏడాది పూర్తిగా అమలు చేయలేదని, రెండో ఏడాదిలో సగం మందికి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. లోకేష్ యువగళంలో పేర్కొన్న నిరుద్యోగ భృతి పథకం ఊసేలేకుండా పోయిందన్నారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, హోం మంత్రి అనిత సొంత నియోజకవర్గంలోనే మహిళలపై దాడులకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో బెల్టుషాపులు పెట్టి ప్రజలను మద్యానికి బానిసలుగా చేసి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. గంజాయి మత్తులో యువత నాశనమైపోతోందన్నారు. కార్యక్రమంలో గుత్తి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్పర్సన్ వరలక్ష్మి యాదవ్, రేవతి (తాడిపత్రి), దేవి, శోభారాణి, భారతి, అనూరాధ, అంజలి, హేమలత, మహేశ్వరి, చంద్రకళ, సుగుణమ్మ పాల్గొన్నారు.


