
‘ఖరీఫ్’కు సిద్ధంకండి
● వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ ఆదేశం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాకు సంబంధించి కీలకమైన ఖరీఫ్ జూన్ నుంచి మొదలు కానుండటంతో క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులను వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. శుక్రవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో అనంతపురం డివిజన్ ఏడీఏ ఎం.రవితో కలిసి ఆరు మండలాల ఏఓలు, ఏఈఓలు, ఆర్ఎస్కే అసిస్టెంట్లతో ఖరీఫ్ పంటల సాగుపై సమీక్షించారు. జూన్ నుంచి ఖరీఫ్ మొదలవుతున్నా... ఇప్పటి నుంచే సన్నాహక చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా రాయితీ విత్తన వేరుశనగ పంపిణీ ప్రక్రియపై దృష్టి సారించాలన్నారు. ఆర్ఎస్కే వేదికగా పంపిణీ సజావుగా జరగాలన్నారు. విత్తన నాణ్యతపై దృష్టి సారించాలన్నారు. అలాగే ఎరువుల సమస్య లేకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. భూసార పరీక్షలకు సంబంధించి టార్గెట్లు వచ్చాయని, వేసవిలోనే పొలాలకు వెళ్లి మట్టి నమూనాలు సేకరించి పంపాలని ఆదేశించారు. ఫార్మర్ రిజిష్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి రైతులను ప్రోత్సహించాలన్నారు. విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా నాన్సబ్సిడీ బకాయిలు లేకుండా వెంటనే చెల్లించాలని ఆదేశించారు. సమావేశంలో ఏఓలు జె.శశికళ, పి.సోమశేఖర్, శ్యాంసుందరరెడ్డి, సుచరిత, విజయకుమార్ పాల్గొన్నారు.