యాక్టివ్గా ఉన్న జాబ్ కార్డులు
2,35,085
జిల్లాలో మొత్తం జాబ్ కార్డుల సంఖ్య
2,72,319
ఉపాధి పొందినవేతనదారులు
2,35,575
2026–27 ఆర్థిక సంవత్సరంలోఉపాధి పనులు
రూ.256.81 కోట్లు
ఉపాధి పనులు చేస్తున్న కూలీలు(ఫైల్)
సాక్షి, అనకాపల్లి: వీబీజీ–రామ్జీ ఉపాధి హామీ కూలీల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. రెండు నెలలుగా వేతనాలు ఇవ్వాలన్న నిబంధనను కూటమి సర్కార్ గాలికి వదిలి వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు ఆసరాగా నిలిచే ఉపాధి హామీ పథకాన్ని అటకెక్కించింది. ఒక వైపు కరవు విలయతాండం చేస్తోంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి వ్యవసాయ పనులు లేవు. ఎల్నినో కారణంగా వర్షాలు పడకపోవడంతో వరినాట్లు వేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇంటి అవసరాలు తీరతాయనే ఆశతో ఉపాధి హామీ పథకం పనులకు వెడితే అక్కడ వేతనాలు ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాదిలో జూన్ 8వ తేదీ నుంచి నేటి వరకూ రెండు నెలలు వేతనాలు బకాయి పడింది.
గతేడాదిలోనూ ఇదే సమస్య..
వేతన బకాయిల కోసం కూలీలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తే గతేడాదికి సంబంధించిన వేతన బకాయిలనూ జాప్యం చేసుకుంటూ ఆలస్యంగా ఐదు వారాల బకాయిలు విడుదల చేసింది. ఇప్పుడు జూన్ నెల 8వ నుంచి నేటి వరకూ ఉపాధి డబ్బులు ఎప్పుడు పడతాయా..!అంటూ కూలీలు ఎదురుచూస్తున్నారు. బయట పనులు లేకపోవడంతో వీటిపైనే ఆధారపడే కుటుంబాలు గ్రామాల్లో ఎక్కువగా ఉన్నాయి. వారికి ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టినా రోజంతా మట్టిలో స్వేదం చిందిస్తే రూ.250–300లకు మించి రావడంలేదు. ఉపాధి పనులకెళ్లినా వేతనాలు వెంటనే అందని పరిస్థితి ఉండడంతో ఇల్లు గడిచేదెలా అంటూ కూలీలు ఆవేదన పడుతున్నారు. జిల్లాలో 24 మండల పరిధిలో ఉపాధి వేతనాలు సుమారుగా రూ.173 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉంది.
విడుదలైన నిధులు రూ.83.81 కోట్లు
పేరు మారినా..రాత మారలేదు...
కేసులు పెట్టకముందే కూలి చెల్లించండి...
జిల్లాలో రెండు నెలలుగా ఉపాధి హామీ బకాయిలను చెల్లించలేదు. సకాలంలో బకాయిలు చెల్లింపులు చేయని సంబంధించిన శాఖపై కూలీలు కేసులు పెట్టుకునే అవకాశం చట్టంలో ఉంది. అ పరిస్థితి రాక ముందే తక్షణమే బకాయిలు చెల్లించాలి. ఉపాధి హామీ శాఖకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంత్రిగా ఉండి కూలీలు కష్టాన్ని అర్థం చేసుకోకపోవడం విచారకరం. ఉపాధి హామీకి రూ.లక్ష కోట్లు ఉన్న బడ్జెట్ను పీఎం మోదీ ప్రభుత్వం దశలవారీగా రూ. 62 వేల కోట్లకు తగ్గించారు. కొన్ని చోట్ల గట్టి నేల ఉంటుంది. అలాంటి చోట్ల వేతనదారులకు డబ్బులు పెంచాలి.
–డి.వెంకన్న, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి
సాంకేతిక కారణాల వల్లే జాప్యం
వేతనాలు పెండింగ్ విషయమై పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. దేశ వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. ఉపాధి వేతనాలు పెండింగ్లో ఉన్న మాట వాస్తవమే. టెక్నికల్ సమస్యల నేపథ్యంలో ఆలస్యమైంది. ఆలస్యమైనా అందరికీ వేతనాలు పడతాయి. ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు.
– సీహెచ్ నిర్మల దేవి, డ్వామా పీడీ, అనకాపల్లి జిల్లా.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్వరూపం మారిపోవడంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్–గ్రామీణ్ పథకం ప్రవేశ పెట్టింది. ఇటీవల ఈ పథకం అమలులోకి వచ్చింది. గతంలో ఏడాదికి 100 రోజులు పనిదినాలు ఇచ్చేవారు. కానీ కొత్త పధకం కింద 125 పనిదినాలకు పెంచారు. ప్రస్తుతం రోజువారీగా రూ.311 రూపాయలు వేతనం అందిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో 24 మండలాల్లో 645 పంచాయతీల్లో 2,72,319 మందికి జాబ్ కార్డులు ఇచ్చారు. జూన్ 8వ తేదీ నుంచి వీరికి వేతనాలు ఇవ్వడం లేదు. జిల్లాలో మొత్తం రూ.173 కోట్లు రూపాయల మేర బకాయిలు ఉన్నాయి. కూలీలు ఉపాధి హామీ పనులపైనే ఆధారపడి జీవిస్తున్నారు.


