నాతవరం: తాండవ రిజర్వాయరు నీటిని రైతులంతా పొదుపుగా వాడుకోవాలని స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఖరీఫ్ సాగుకు తాండవ రిజర్వాయర్ నీటిని మంగళవారం గేట్లు ఎత్తి కాలువల ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండవ ప్రాజెక్టుతో పాటు పంట కాలువలు అభివృద్ధికి రెండేళ్ల కాలంలో రూ.12 కోట్లు మంజూరు చేశానన్నారు. మిగిలి ఉన్న పనులను వివిధ దశల్లో అభివృద్ధి చేస్తానన్నారు. నాతవరం, గొలుగొండ మండలాలను అనుసంధానం చేసే తాండవ ఘాట్ రోడ్డుకు రక్షణ గోడల నిర్మాణంతో పాటు రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. ఇరిగేషన్ ఈఈ బాలసూర్యం మాట్లాడుతూ తాండవ ప్రాజెక్టులో నీటి మట్టం 375.2 అడుగులు నీరు ఉందన్నారు. నీటిని రెండు కాలువలు ద్వారా రోజుకు 500 క్యూసెక్కులు చొప్పున విడుదల చేస్తే 70 రోజులు ఆయకట్టు భూములకు ప్రవహిస్తుందన్నారు. శివారు ఆయకట్టుకు సైతం నీరు సరఫరా చేసేందుకు నీరు ఎక్కడా వృథా కాకుండా పొదుపుగా వాడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణ, వైస్ చైర్మన్ మేడపురెడ్ది జోగుబాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, రాష్ట్ర కార్పొరేషన్ డైర్టెక్టర్లు రాజాన వీర సూర్య చంద్ర, కొండ్రు మరిడియ్య, లాలం కాశీనాయుడు, ఆర్డీవో వి.వి.రమణ, తహసీల్దార్ చందనరేఖ, ప్రాజెక్టు డీఈ ఆనురాధ, జేఈ శ్యామ్కుమార్, ఇన్చార్జి ఎంపీడీవో మూర్తిబాబు, ఆర్అండ్బీ డీఈ విద్యాసాగర్ జేఈ నాయుడుబాబు, నీటి సంఘాల అధ్యక్షులు రైతులు పాల్గొన్నారు.


