● ప్రాజెక్టు డీఈఈ అనురాధ
నాతవరం: తాండవ రిజర్వాయర్ నుంచి ఖరీఫ్ సాగుకు ఈనెల 11వ తేదీ మధ్యాహ్నం 12.09 గంటలకు నీటిని విడుదల చేయనున్నట్టు ప్రాజెక్టు డీఈఈ అనురాధ తెలిపారు. ఆమె శనివారం విలేకరులతో మాట్లాడుతూ రెండు జిల్లాల పరిధిలో 52 వేల ఎకరాలకు తాండవ జలాశయం నుంచి సాగునీరు అందజేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం 375.2 అడుగులు ఉందని, రెండు ప్రధాన కాలువల ద్వారా రోజుకు 500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తే 70 రోజుల వరకూ సాగుకు సరిపోతుందని తెలిపారు. తాండవ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తే వర్షాలు కురుస్తాయన్న నమ్మకం ఈప్రాంత రైతుల్లో ఉందన్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు కమిటీ చైర్మన్, సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఆయకట్టుదారుల అభీష్టం మేరకు నీటిని విడుదల చేసేందుకు నిర్ణయించినట్టు తెలిపారు.
రేపు చలో విద్యుత్ సౌధ
అనకాపల్లి: విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేపట్టిన దశల వారీ పోరాటంలో భాగంగా సోమవారం చలో విద్యుత్ సౌధ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు ప్రేమ చంద్రశేఖర్ తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో యూనియన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయన్నారు. విద్యుత్ రంగాన్ని కాపాడుకోవడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులను విద్యుత్ శాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అంబాని, అదాని వంటి కార్పొరేట్ సంస్థలకు విద్యుత్శాఖను కట్టబెట్టేందుకు ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయన్నారు.కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వలె కాంట్రాక్టు ఉద్యోగులకు నెలకు రూ.48 వేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వేపాడ సత్యనారాయణ, ఎస్.సత్యారావు, అనకాపల్లి, నర్సీపట్నం డివిజన్ నాయకులు పాల్గొన్నారు.


