మునగపాక : డీఎస్సీ అక్రమాలతో పాటు నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా మంగళవారం అనకాపల్లిలో నిర్వహించే యువత, విద్యార్థి ర్యాలీని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కోరారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ డీఎస్సీలో అక్రమాలు చోటు చేసుకోవడంతో ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే యువకులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు భరోసా ఉండేదన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హయాంలో నీట్ పేపర్ లీకేజీ, అలాగే రాష్ట్రంలో డీఎస్సీలో జరిగిన అక్రమాలను చాటిచెప్పేందుకు జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు అనకాపల్లిలో యువత, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారన్నారు. అనకాపల్లి రామచంద్ర థియేటర్ నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ నాలుగు రోడ్ల జంక్షన్ మీదుగా పెరుగుబజారు సెంటర్ వరకు కొనసాగుతుందన్నారు. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
ర్యాలీని విజయవంతం చేయాలి..
అనకాపల్లిలో మంగళవారం నిర్వహించే విద్యార్థి, యువత ర్యాలీని ప్రతీ ఒక్కరూ విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ఆడారి అచ్చియ్యనాయుడు కోరారు. మండలంలోని పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు.


