బావ, బావమరిది మృతి
మృతులు నూకరాజు, శ్రీనివాస్
బుచ్చెయ్యపేట: కొత్తగా పెళ్లయిన వరుడు తన బావతో కలిసి సరదాగా గోదావరి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగిపోయి చనిపోయిన ఘటన రాజమహేంద్రవరంలో సోమవారం సాయంత్రం జరిగింది. వీరిద్దరు మృతి ఘటన బుచ్చెయ్యపేట మండలం తైపురంలో తీవ్ర విషాదం నింపింది. వివరాలివి... బుచ్చెయ్యపేట మండలం తైపురం గ్రామానికి చెందిన వియ్యపు పెదరాజు, సత్యవతిల కుమారుడు నూకరాజు(26)కు గత నెల 12వ తేదీన కశింకోట మండలం జొమ్మనపాలేనికి చెందిన ఓ యువతితో వివాహమైంది. వివాహమైన తర్వాత రాజమహేంద్రవరంలో ఉంటున్న తన అక్కాబావ వద్దకు నూకరాజు తన భార్యతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం అక్కడ గోదావరిలో స్నానానికి వెళ్లిన బావ, బావమరిది శ్రీనివాస్, నూకరాజు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతి చెందారు. పెళ్లయి 20 రోజులకే పచ్చని తోరణాలతో కళకళలాడుతున్న ఇంట్లో ఈ విషాద ఘటన చోటు చేసుకోవడంతో ఇరు కుటుంబ సభ్యులు బోరున విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. మంగళవారం రాజమహేంద్రవరంలో నూకరాజు, శ్రీనివాస్ల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి తైపురం తీసుకువస్తామని బంధువులు తెలిపారు.


