చోడవరం: భూ, రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు కలెక్టర్ విజయ్కృష్ణన్ అన్నారు. చోడవరంలో శుక్రవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు వచ్చి, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న భూ, రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు అందజేశారు. కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో రెవెన్యూ, భూ సమస్యల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్యలను క్షేత్రస్థాయిలో వెంటనే పరిష్కరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. భూ పరిపాలన కమిషనర్(సీసీఎల్ఏ) నిబంధనలకు లోబడి భూ సమస్యలు పరిష్కరించనున్నట్టు ఆమె చెప్పారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను కేవలం ఒక్క నెలలోనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. భూ, రెవెన్యూకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రెవెన్యూ కార్యాలయాల్లో పెండింగ్లో ఉండకూడదని జిల్లా అధికారులను ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో భూ సమస్యలు పరిష్కరించడం వల్ల కోర్టు కేసులు తగ్గుతాయని చెప్పారు. అంతకుముందు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో చేపట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శార్యమన్ పటేల్, డీఆర్వో సత్యనారాయణ, అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవోలు షేక్ ఆయీషా, వి.వి. రమణ, చోడవరం తహసీల్దార్ రామారావుతోపాటు బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ విజయ కృష్ణన్


