అరకులోయ టౌన్: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు రేగం చాణక్య డిమాండ్ చేశారు. మహిళల మనోభావాలు దెబ్బతీసేలా, వారిని కించపరిచేలా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా వ్యతిరేక కథనాలపై నిరసన
బుధవారం అరకులోయ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ నాయకులు భారీ నిరసన చేపట్టారు. రాధాకృష్ణ ప్రసారం చేసిన కథనాలు మహిళలను అవమానించేలా ఉన్నాయని మండిపడుతూ, ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రతులను దహనం చేశారు. తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని మహిళా లోకానికి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అవి కొత్త పలుకులు కాదు.. చెత్త పలుకులు!
ఈ సందర్భంగా రేగం చాణక్య మాట్లాడుతూ.. రాధాకృష్ణ చెప్పేవి ‘కొత్త పలుకులు’ కావని, అవి ‘చెత్త పలుకులు’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మహిళలను ఎవరు దూషించినా కఠిన చర్యలు తీసుకుంటామని గొప్పలు చెప్పే మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత.. రాధాకృష్ణ వ్యవహారంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని వీడి, తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్ కుమార్, అరకులోయ, డుంబ్రిగుడ మండల పార్టీ అధ్యక్షులు రామ్మూర్తి, పాంగి పరశురాం, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, మండల యువజన విభాగం అధ్యక్షుడు బోయి కిరణ్ కుమార్, మండల కార్యదర్శి గుంజిడి ప్రసాద్, సుంకరమెట్ట గ్రామ కమిటీ అధ్యక్షుడు కొర్రా అర్జున్ పాల్గొన్నారు.


