దేవరాపల్లి: స్మార్ట్ కిచెన్ పేరిట ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించి మిడ్డే మీల్స్ కార్మికుల పొట్ట కొట్టొదని ఏపీ వ్యవసాయ కార్మిక జిల్లా ఉపాధ్యక్షుడు డి. వెంకన్న, సీఐటీయూ మండల కార్యదర్శి బి.టి. దొర కోరారు. మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు బుధవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారు పాల్గొని మద్దతు ప్రకటించారు. బిల్లులు, వేతనాలు సక్రమంగా సకాలంలో ఇవ్వక పోయినా అప్పులు చేసి మరీ భోజనం అందిస్తున్న కార్మికులను తొలగించే ప్రయత్నం చేయడం అత్యంత దారుణమన్నారు. ఏళ్ల తరబడి పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్న నిర్వహకులకు మెనూ చార్జీలు, వేతనాలు పెంచి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ కిచెన్ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని, లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం స్థానిక ఎంఈవో ఈశ్వరరావుకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కోలా మేరీరత్నం, పల్లి రాములమ్మ, సింగంపల్లి మహాలక్ష్మీ, రాయి సన్యాసమ్మ, గాలి గంగమ్మ, దాసరి రాము, పులిగా రమణమ్మ, కంచి మహాలక్ష్మీ తదితర మిడ్డే మీల్స్ నిర్వాహకులు పాల్గొన్నారు.
దేవరాపల్లి ఎంఈవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న మీడ్డే మీల్స్ నిర్వాహకులు
ఎంఈవో ఈశ్వరరావుకు వినతి పత్రం అందజేస్తున్న మధ్యాహ్న భోజన పధకం నిర్వాహకులు


