అధికారులకు సూచనలిస్తున్న కేంద్ర కార్యదర్శి డాక్టర్ సౌరభ్ గార్గ్
మహారాణిపేట(విశాఖ): భారత ప్రభుత్వ కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ సౌరభ్ గార్గ్ బుధవారం నగరంలోని జాతీయ గణాంక కార్యాలయాన్ని సందర్శించారు. త్వరలో ప్రారంభం కానున్న నేషనల్ హౌస్హోల్డ్ ఇన్కమ్ సర్వే ఫీల్డ్ వర్క్ను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం సర్వే అమలు విధానంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సౌరభ్ గార్గ్ మాట్లాడుతూ.. సర్వే నిర్వహణలో కచ్చితత్వం, సమగ్రత, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. దేశవ్యాప్తంగా చేపట్టనున్న ఈ సర్వే విజయవంతం కావడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం ఈ సర్వేలో పాల్గొని, నిక్కచ్చిగా సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డి.సతీష్, జాయింట్ డైరెక్టర్ రజత్, అసిస్టెంట్ డైరెక్టర్ పి. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


