సామాజిక పరివర్తనతో ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన
ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్
అనకాపల్లి టౌన్: సామాజిక పరివర్తన ద్వారానే ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించవచ్చని కలెక్టర్ విజయ కృష్ణన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ దినం సందర్భంగా ఎన్టీఆర్ వైద్యాలయంలో సోమవారం నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ఎన్టీఆర్ ఆస్పత్రి నుంచి ప్రధాన రహదారి బైపాస్ రోడ్ వరకు సాగింది. అనంతరం నాలుగురోడ్ల జంక్షన్లో మానవహారంగా ఏర్పడి ఎయిడ్స్ వ్యాధి నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ హైమావతి, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త శ్రీనివాస్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.


