
అందరూ దోషులే!
బండరాళ్ల టిప్పర్తో భయోత్పాతం...
● ఈ ఏడాది మార్చి 25న
అనకాపల్లి టౌన్లో విజయరామరాజు పేట వద్ద గల రైల్వే
అండర్ బ్రిడ్జి గడ్డర్ను క్వారీ లారీ ఢీకొనడంతో భారీ ప్రమాదం తప్పింది. దీంతో రైల్వే గడ్డర్ పాక్షికంగా దెబ్బతింది.
● అక్రమ మైనింగ్కు కొమ్ముకాస్తున్న అధికారులు
● కూటమి నేతల ధనదాహానికి ప్రజల ప్రాణాలు హరి
● భారీ రాళ్ల తరలింపుతో రోడ్లు ఛిద్రం
● పక్క జిల్లా నుంచి వస్తున్నా పట్టించుకునే వారేరీ
● మైనింగ్, పోలీసు, రవాణా అధికారులకు భారీగా ముడుపులు
● కాకినాడ జిల్లా రౌతులపూడికి చెందిన సన్నిధి మినరల్స్ టిప్పరు రాంబిల్లి మండలం కొండవారపాలెం గ్రామం వద్ద శుక్రవారం ఉదయం జార విడిచిన బండరాళ్లు ఇవి. వెనుక ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అధిక లోడుతో ప్రమాదకర రాళ్లతో ఎటువంటి కనీస జాగ్రత్తలు తీసుకోకుండా అంత నిర్లక్ష్యంగా ఇష్టారాజ్యంగా వెళ్లడానికి వారికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
● ఈ ఏడాది మార్చి 16వ తేదీన మునగపాకకు చెందిన టీడీపీ కార్యకర్త, ఎల్ఐసీ ఏజెంట్ గన్నారావు మైనింగ్ టిప్పరు గుద్ది ప్రాణాలు కోల్పోయారు. కంటితుడుపుగా కేసు పెట్టడం మినహా రోజువారీగా అక్రమ మైనింగ్, అధిక లోడు వాహనాల విషయంలో తనిఖీలు మాత్రం జరగడం లేదు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
అనకాపల్లి జిల్లా మైనింగ్ అవకతవకలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. శుక్రవారంనాటి తాజా సంఘటననే ఇందుకు ఉదాహరణ. వాస్తవానికి రాంబిల్లి మండలంలోని కొండవారపాలెం వద్ద రెండు బండరాళ్లను విడిచిన టిప్పర్లు పక్క జిల్లా కాకినాడ నుంచి వస్తున్నాయి. తుని, పాయకరావుపేట, నక్కపల్లి, యలమంచిలి నియోజకవర్గాలను దాటుకుని రాంబిల్లి వద్ద జరుగుతున్న నావికాదళ పనుల కోసం ఈ బండరాళ్లను తరలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని పోలీసు, రవాణా, మైనింగ్ అధికారులు తనిఖీలు జరిపితే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించే వీలుంటుంది. ప్రతి రోజూ పక్క జిల్లా నుంచి పదుల సంఖ్యలో అధిక లోడుతో టిప్పర్లు వస్తున్నప్పటికీ ఆయా స్టేషన్ల పరిధిలోని పోలీసు, రవాణా శాఖల సిబ్బంది పట్టించుకోవడం లేదు. ప్రతి నెలా భారీగా అందుతున్న మామూళ్లే ఇందుకు కారణమని వేరే చెప్పనక్కరలేదు.
అధిక లోడుతో చక్కర్లు...!
అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్తో టిప్పర్లు అధికలోడుతో వెళుతున్నాయి. తద్వారా రోడ్లన్నీ ఛిద్రమవుతున్నాయి. ఇప్పటికే అనేకసార్లు ప్రమాదాలు కూడా జరిగాయి. కొంత మంది ప్రాణాలను కూడా బలితీసుకున్నాయి. అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న వివిధ క్వారీల ద్వారా రోజువారీ 1,000 ట్రిప్పుల బండరాళ్లను మునగపాక మీదుగా రోడ్లపై భారీ శబ్దాలు చేస్తూ రాంబిల్లిలోని నావికాదళ పనుల కోసం తరలిస్తున్నారు. 32–36 టన్నుల సామర్ధ్యం కలిగిన టిప్పర్లల్లో ఏకంగా 50 టన్నుల మేరకు భారీ బండరాళ్లు వేసుకుని తిరుగుతున్నా అటు మైనింగ్ అధికారులు కానీ, ఇటు రవాణాశాఖ, పోలీసు, రెవెన్యూ అధికారులు కానీ కనీసం కన్నెత్తి చూడటం లేదు.
అక్రమ సంపాదన నెలకు రూ.2 కోట్లు
ఒక్కో ట్రిప్పునకు నెలకు రూ.22 వేల చొప్పున కూటమి నేతలు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నెలవారీ వసూలవుతున్న మొత్తం రూ.2 కోట్లకు పైమాటే. కూటమి నేతలతోపాటు మైనింగ్, రవాణా, పోలీసు, రెవెన్యూ అధికారులకూ భారీగా వాటాలు అందుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రవాణాశాఖ అధికారులు అధిక లోడుతో వెళుతున్న వాహనాలను చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారు. అనధికారిక క్వారీల్లో జరుగుతున్న మైనింగ్ను పట్టించుకోకుండా ఉండేందుకుగానూ మైనింగ్ అధికారులకూ భారీగా ముడుతోందన్న విమర్శలున్నాయి. అక్రమ మైనింగ్తో పాటు అధిక లోడుతో భారీగా రాయల్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. ఇక మైనింగ్ విజిలెన్స్ అధికారులు కనీసం ఒక్కటంటే ఒక్కసారి కూడా దాడులు చేసి అక్రమ మైనింగ్ను నిలిపివేసేందుకు గత 6 నెలల కాలంలో ప్రయత్నించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు స్థానిక పోలీసు, రెవెన్యూ, విజిలెన్స్ ఇలా అన్ని విభాగాల అధికారులకు వాటాల లెక్కన పంచుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాలన్నీ కూటమి నేత బంధువు దగ్గరుండీ మరీ చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరి వాటా వారికి ఇచ్చిన తర్వాత మిగిలిన మొత్తం భారీ స్థాయిలో సదరు కూటమి నేత బంధువు జేబులోకి వెళుతోంది.
సాక్షి, అనకాపల్లి: వాహనచోదకులకు ఘోర ప్రమాదం తప్పింది. రాంబిల్లి మండలంలోని కొండవారపాలెం వద్ద నేవల్బేస్కు తరలిస్తున్న బండరాళ్ల లారీ నుంచి రెండు పెద్ద రాళ్లు అకస్మాత్తుగా రోడ్డుపైకి పడ్డాయి. శుక్రవారం ఉదయం 9:30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికులను బెంబేలెత్తించింది. ఇటీవల కాలంలో జిల్లాలోని పలు క్వారీల నుంచి బండరాళ్ల లోడుతో కూడిన లారీలు నేవల్బేస్కు ప్రమాదకర రీతిలో వెళ్తున్పప్పటికీ పలు శాఖల అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం టిప్పర్ లారీపై నుంచి కొండవారపా లెం వద్ద భారీ రాళ్లు రోడ్డుపై పడ్డాయి. అదృష్టవశాత్తూ వాహనచోదకులకు ప్రమాదం తప్పింది. రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. కాకినాడ జిల్లా రౌతులపూడికి చెందిన టిప్పర్ డ్రైవర్ దమ్ము శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి చర్యల్లో భాగంగా ఆర్టీఏ అధికారులకు సిఫారసు చేశారు.

అందరూ దోషులే!

అందరూ దోషులే!

అందరూ దోషులే!

అందరూ దోషులే!

అందరూ దోషులే!