కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటాడనుకుంటే.. చిన్న వయసులోనే! | - | Sakshi
Sakshi News home page

కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటాడనుకుంటే.. చిన్న వయసులోనే!

Aug 25 2023 1:06 AM | Updated on Aug 28 2023 11:51 AM

- - Sakshi

మునగపాక : కుటుంబానికి పెద్దదిక్కుగా నిలుస్తాడని ఆశించిన కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది. అందరితో సరదాగా ఉండే ఆ యువకుడు పాముకాటుకు గురై మృతి చెందాడు. దీంతో మూలపేటలో విషాదం అలముకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మూలపేటకు చెందిన మొల్లేటి పరమేష్‌–మాణిక్యం దంపతులకు ముగ్గురు కుమారులు. పరమేష్‌ ఇటుకబట్టీ నిర్వహిస్తూ కుటుంబ పోషణ సాగిస్తున్నాడు. పరమేష్‌ పెద్ద కుమారుడు శంకర్‌ గణేష్‌(21) తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ ట్రాక్టర్‌ నిర్వహణ చేస్తున్నాడు.

సాయంత్రం ట్రాక్టర్‌కు డీజిల్‌ తీసుకువెళ్లే క్రమంలో తన బైక్‌పై గంగాలమ్మ తల్లి గుడి వరకు వెళ్లి అక్కడ బైక్‌ను వదిలేసి కొంతదూరం నడుచుకొని వెళ్లాడు. ఈ క్రమంలో గణేష్‌ను పాము కాటు వేసింది. డీజిల్‌ పట్టుకెళ్లిన కొడుకు ఎంతకూ రాకపోవడంతో కంగారు పడ్డ తండ్రి పరమేష్‌ ఇతరులకు సమాచారం అందించారు. కుమారుడు గణేష్‌ ఫోన్‌ నంబరుకు ఎంత డయల్‌ చేసినా స్పందన రాకపోవడంతో బైక్‌ వదిలిన ప్రదేశం నుంచి కొంతదూరం వెళుతుండగా మార్గమధ్యంలో గణేష్‌ కిందపడి ఉండడాన్ని గమనించారు.

అప్పటికే పాము కాటుకు గురై గణేష్‌ మృతిచెందడాన్ని గుర్తించి మునగపాక పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం గణేష్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గణేష్‌ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గణేష్‌ అంత్యక్రియలు మూలపేటలో గురువారం మద్యాహ్నం జరిగాయి. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ అనకాపల్లి వందపడకల ఆస్పత్రికి వెళ్లి పంచనామా వేగవంతమయ్యేలా చర్యలు తీసుకున్నారు. గణేష్‌ తండ్రి పరమేష్‌ను ఓదార్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement