సీలేరు: దారకొండ పంచాయతీ నుంచి గంగవరం మీదుగా ఒడిశా వెళ్లే ప్రధాన రహదారిలో, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన పనులను అధికారులు మంగళవారం పూర్తి చేసి రాకపోకలను పునరుద్ధరించారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు వేగంగా స్పందించి ఈ పనులు చేపట్టారు. అయితే, 2014లో వచ్చిన వరదల్లో ఇక్కడ ఉన్న ప్రధాన వంతెన కొట్టుకుపోగా, నాటి నుంచి అధికారులు తాత్కాలిక ఏర్పాట్లతోనే సరిపెడుతున్నారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి వర్షాలకు తాత్కాలిక వంతెన కొట్టుకుపోయి గంటల తరబడి రాకపోకలు నిలిచిపోవడం వల్ల నిత్యావసరాలు అందక, అత్యవసర వైద్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. శాశ్వత వంతెన కోసం ఎన్నిసార్లు నిరసనలు తెలిపినా, వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు ప్రతిపాదనల సాకుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి పూర్తిస్థాయి వంతెన నిర్మించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని గిరిజనులు హెచ్చరించారు.
శాశ్వత వంతెన నిర్మించాలనిగిరిజనుల డిమాండ్


