సబ్బవరం: నేరాల నియంత్రణలో అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పోలీస్ సిబ్బందికి సూచించారు. స్థానిక పోలీస్స్టేషన్ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీచేసి, స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిస్థితి, నేర నియంత్రణ చర్యలపై అధికారులతో సమీక్షించారు. తనిఖీలో భాగంగా క్రైమ్ రికార్డులు, జనరల్ డైరీ, పెండింగ్ కేసుల ఫైళ్లు, కంప్యూటర్ విభాగం, లాకప్ గది, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పెండింగ్ కేసులు సుదీర్ఘంగా ఉంచకుండా ఆధారాలతో దర్యాప్తు పూర్తి చేసి, సకాలంలో కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో ప్రధాన కూడళ్లు, కాలనీలు, జాతీయ రహదారులపై బీట్, పెట్రోలింగ్ను మరింత పటిష్టం చేయాలని సూచించారు. దొంగతనాలు, ఇతర నేరాలకు ఆస్కారం లేకుండా అనుమానిత వ్యక్తుల కధలికలపై నిఘా ఉంచాలన్నారు. గంజాయి, అక్రమ మద్యం, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలపై నిఘా కొనసాగిస్తూ, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను శ్రద్ధగా వినాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సబ్బవరం సీఐ జి.రామచంద్రరావు, ఎస్ఐ సింహాచలం, స్టేషన్ సిబ్బంది ఆయనకు అవసరమైన సమాచారం అందించారు.
సబ్బవరం పోలీస్స్టేషన్ తనిఖీలో ఎస్పీ తుహిన్ సిన్హా


