నాతవరం: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. మండల కేంద్రం నాతవరంలో పార్టీ మండల అధ్యక్షుడు లగుడు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన పార్టీ సమావేశంలో ప్రసాద్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తే సునాయాసంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కూటమి నాయకులు నర్సీపట్నం ప్రాంతంలో వైఎస్సార్సీపీ నాయకులపై కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ ప్రజల పక్షాన పోరాడుతుంటే తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా జైలుకు పంపించేందుకు కుట్ర చేశారని గుర్తు చేశారు. ఇటీవల జరిపిన సర్వేలో జిల్లాలోనే నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రజలు టీడీపీ కంటే వైఎస్సార్సీపీ వైపు 8 శాతం అధికంగా ఉన్నారని తేలిందన్నారు. డీఎస్సీలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని, క్రీడాకారుల కోటా పేరుతో నచ్చినవారికి పోస్టులు కట్టబెట్టారని ఆరోపించారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి 1.30 లక్షలకు పైగా సచివాలయ ఉద్యోగాలను ఎటువంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా భర్తీ చేశారని చెప్పారు. గతంలో పోలవరం కాలువ పనులను గాలికి వదిలేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన కృషి వల్లే సాధ్యమైందని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు?
అనంతరం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ... ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా కూటమి నాయకులు జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పింఛన్లు, బీసీల రిజర్వేషన్లు గుర్తుకు వస్తాయని, తర్వాత మళ్లీ యథావిధిగా మరిచిపోతారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా పథకాలు అందించారన్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సైనికుల్లా పనిచేసి విజయబావుటా ఎగురవేయాలన్నారు. అభ్యర్థుల ఎంపికను స్థానికంగానే చేయాలని, అందులో తమ ప్రమేయం ఉండదన్నారు.
అనంతరం 31 గ్రామ పంచాయతీల్లో నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, వైస్ ఎంపీపీలు పైల సునీల్, మైనం శ్రీనాగ గోపి, జెడ్పీటీసీ కాపారపు అప్పలనర్స, నాలుగు మండలాల అధ్యక్షులు లగుడు నాగేశ్వరరావు, చిటికిల రమణ, కోరుప్రోలు పాణిశాంతారాం, ఏకా శివ చినబాబు, జిల్లా కమిటీ సభ్యులు కరక అప్పలరాజు, శిరుసుపల్లి నర్సింగరావు, పైల పోతురాజు, గొర్లె వరహాలబాబు, మంకు సాంబమూర్తి, ఇట్టంశెట్టి శ్రీను, మండల యూత్ అధ్యక్షుడు బండారు నాయుడు, మహిళా విభాగం అధ్యక్షురాలు పోలుపర్తి రాధ, మాజీ సర్పంచులు అంకంరెడ్డి పార్వతి, గొలగాని రాణీ, పైల శిరీషా, లాలం లోవ, వేముల సూర్యనారాయణ, పార్టీ సీనియర్ నాయకులు సిద్దాబత్తుల వెంకటరమణ, గుడపర్తి అచ్చియ్యనాయుడు, నాతవరం గ్రామ కమిటీ అధ్యక్షుడు శెట్టి లచ్చబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బొడ్డేడ ప్రసాద్ను మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ తదితరులు సన్మానించారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్


