చింతపల్లి: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లంబసింగి పరిసరాల్లో రానున్న పర్యాటక సీజన్లో పోలీసు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక డీఎస్పీ సీహెచ్ తిరుపతిరావు హెచ్చరించారు. శుక్రవారం స్థానిక సబ్ డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయంలో లంబసింగి, తాజంగి పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు రిసార్టులు నడుపుతున్న నిర్వాహకులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పర్యాటక సీజన్లో ఈ ప్రాంతాన్ని సందర్శించే కుటుంబాలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత రిసార్ట్ నిర్వాహకులపైనే ఉందన్నారు. రిసార్టులకు వచ్చే పర్యాటకుల గుర్తింపు కార్డులు, ఫోన్ నంబర్లు, పూర్తి వివరాలను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. రిసార్టుల్లో అక్రమంగా మద్యం సేవించడాన్ని పూర్తిగా నిషేధించాలని ఆదేశించారు. యువకులు, ఇతర బృందాలు వచ్చినప్పుడు వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని సూచించారు. ప్రతి రిసార్ట్ ప్రవేశ ద్వారం, పార్కింగ్, కారిడార్లు తదితర ప్రాంతాల్లో 24 గంటలూ పనిచేసే సీసీ కెమెరాలను విధిగా ఏర్పాటు చేయాలన్నారు. కనీసం నెల రోజుల సీసీ పుటేజీలను భద్రపరచాలని సూచించారు. చీకటి పడిన తర్వాత రిసార్ట్ ప్రాంగణాల్లో తగిన వెలుగు ఉండేలా ప్రత్యేక లైటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి డిజే సౌండ్ సిస్టమ్లు వాడకూడదని సూచించారు. ఏ ఒక్కరూ అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సీఐ సింహాచలం, పలువురు ప్రైవేటు రిసార్ట్ నిర్వాహకులు పాల్గొన్నారు.


