అనకాపల్లి టౌన్: దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క అర్హుడికి వచ్చేనెల 1వ తేదీ నుంచి పింఛన్ మంజూరు చేయాలని వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు డిమాండ్ చేశారు. స్థానిక వేల్పులవీధి స్వర్ణ సచివాలయంలో జరుగుతున్న పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను శుక్రవారం 82, 83 వార్డు పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పింఛన్ల విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నరేళ్లు అయిందని, పెన్షన్లపై తరచూ వైఎస్సార్ సీపీ పోరాటాలు చేస్తున్నా.. పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల్లో ఓట్ల కోసం ఒక్కసారిగా పింఛన్లు ఇస్తామంటూ హడావుడి చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇప్పుడు కేవలం దరఖాస్తులు స్వీకరణ మాత్రమేనని, బడ్జెట్ చూసిన తర్వాతే పింఛన్లు మంజూరు చేస్తామనడం చంద్రబాబు మార్క్ పాలనకు నిదర్శనమన్నారు. వారం రోజుల మాత్రమే గడువు పెట్టారని, అందులో రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి పండగ పోతే కేవలం నాలుగు రోజుల మాత్రమే దరఖాస్తులు స్వీకరించడం అన్యాయమన్నారు. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు వలంటీర్ల ద్వారా ఇంటింటికీ అందింవడం నిరతర ప్రక్రియగా కొనసాగేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఇచ్చిన గడువును పొడిగించి దరఖాస్తులు స్వీకరించాలని డిమాండ్ చేశారు. పార్టీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, 82, 83 వార్డు అధ్యక్షుడు అల్లు త్రినాథ్, బుద్ద భాస్కరరావు, మాజీ కౌన్సిలర్లు నడిశెట్టి మధు, కొండూరు రవీంద్ర, కుండల రామకృష్ణ, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉగ్గిన అప్పారావు, కాకుకుండి కన్నబాబు, ఉగ్గిన శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


