● వైద్యాధికారి కిషోర్
జి.మాడుగుల: వాతావరణ మార్పుల వల్ల సంభవించే సీజనల్ వ్యాధుల పట్ల గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే సమీప పీహెచ్సీ/ వైద్య సిబ్బందిని సంప్రదించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కిషోర్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు శుక్రవారం మండలంలోని దిగువ రచ్చపల్లి గ్రామంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో జ్వరం, ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గు, రక్తపోటు వంటి సమస్యలతో బాధపడుతున్న మొత్తం 46 మందికి డాక్టర్ కిశోర్ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.జ్వరంతో బాధపడుతున్న ఆరుగురికి ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ద్వారా మలేరియా పరీక్షలు చేయగా నెగటివ్గా నమోదైంది. అలాగే ఒళ్లు నొప్పులతో 13 మంది, జలుబుతో 16 మంది, దగ్గుతో 5 గురు, బీపీతో 6 మంది బాధపడుతున్నట్లు గుర్తించి వారికి తగిన చికిత్స అందించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని డాక్టర్ కిశోర్ కోరారు. నీటిని కాచి చల్లార్చి, వడపోసి మాత్రమే తాగాలని గిరిజనులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈవో ప్రకాష్, ఎంపీహెచ్ఏ శోభన్, ఎంఎల్హెచ్పీ జ్యోతి, ఏఎన్ఎంలు దేవి, కుమారి, రత్నకుమారి, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.


