● జెడ్పీ సీఈవో నారాయణమూర్తి
కశింకోట: మండలంలోని జి.భీమవరం గ్రామ పంచాయతీకి జాతీయ పురస్కారం సాధించడమే లక్ష్యంగా సమష్టిగా కృషి చేయాలని జెడ్పీ సీఈవో పి. నారాయణమూర్తి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం పంచాయతీని ఆకస్మికంగా సందర్శించారు. పంచాయతీలో నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతులపై పరిశీలించారు. జి.భీమవరాన్ని జాతీయ పురస్కారానికి ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వెల్నెస్ కేంద్రం వద్ద సిమెంట్ కాలువ ఏర్పాటు చేయాలని, సంపద కేంద్రానికి గ్రావెల్రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాభివృద్ధి పనుల్లో నాణ్యత, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. సంపద కేంద్రాన్ని, దాని పని తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీడీవో సీహెచ్. చంద్రశేఖరరావు, డిప్యూటీ ఎంపీడీవో ఎం.వెంకటలక్ష్మి, పీఆర్ ఏఈ శేఖర్, పంచాయతీ అభివృద్ధి అధికారి ఆర్.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.


