పాడేరు: అంగవైకల్యం నివారణకు ముందస్తుగానే ఇంటింటా కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే చేపడుతున్నామని, ఈనెల 11 నుండి 24 వరకు సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలోని తన ఛాంబర్లో బుధవారం కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే పోస్టర్లు, బ్యానర్లను వైద్యారోగ్య శాఖ సిబ్బందితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆశా కార్యకర్తలు, ఎంపిక చేసిన పురుష ఆరోగ్య కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటినీ సందర్శించి పరీక్షలు నిర్వహించాలన్నారు. అనుమానిత కేసులను గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య బృందం ద్వారా మరోసారి నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా బహుళ ఔషధ చికిత్స అందించనున్నట్లు తెలిపారు. తొలిదశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా అంగవైకల్యాన్ని అరికట్టవచ్చన్నారు. శరీరంపై స్పర్శ తెలియని అనుమానాస్పద మచ్చలు ఉంటే సర్వే బృందానికి తెలియజేసి, ప్రజలంతా ఈ సర్వేకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రియాజ్ బేగ్, జిల్లా కుష్టు, క్షయ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కిరణ్కుమార్, ఏడీఎంహెచ్ఓ డాక్టర్ బాలమురళీకృష్ణ, డిప్యూటీ డీఎంవో సింహాచలం, ఎంపీహెచ్ఈవో సంజీవపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.


