నర్సీపట్నం : టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ సభ..ఎన్నికల సభను తలపించింది. బీసీల అవగాహన సభ అంటూనే రాజకీయ మీటింగ్ తరహాలో నేతల ప్రసంగాలు సాగాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029 సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా పని చేయాలని నేతలు పిలుపునిచ్చారు. స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ 34 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఎంతో ఉపయోగమన్నారు. రిజర్వేషన్ వల్ల కలిగే ప్రయోజనాన్ని గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికకు సంబంధించిన అభ్యర్థులను గ్రామస్థాయి నాయకులే ఎంపిక చేయాలన్నారు. ఎవరైతే గ్రామాభివృద్ధికి పాటుపడతాడో అటువంటి వ్యక్తుల పేర్ల జాబితాను ఇవ్వండి.. మీరు సూచించిన వ్యక్తికే సీటు ఇస్తా...గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే అన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీల అభ్యర్ధులను పార్టీ నాయకులే ఎంపిక చేయాలని సూచించారు. బీసీలకు సముచిత స్థానం కల్పించింది టీడీపీ మాత్రమే అన్నారు. రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ మాట్లాడుతూ రిజర్వేషన్లతో సీఎం చంద్రబాబు బీసీల జీవితాల్లో వెలుగు నింపారన్నారు. బీసీలకు బంగారు బాట వేసారన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోతే కేంద్రం నుంచి రావాల్సిన 16వ ఆర్థిక సంఘం నిధులు రూ.3 వేల కోట్లు వరకు రాష్ట్రం నష్టపోతుందన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ సత్తా చా టాలని పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


