యలమంచిలి రూరల్ : పట్టణంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి భానుడి ప్రతాపం, వేడి గాలుల వాతావరణంతో ఉక్కిరిబిక్కిరైన జనం ఒక్కసారిగా వాతావరణం మేఘావృతమై ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. ఎల్నినో ప్రభావంతో వరుణుడు ముఖం చాటేయడం, వేసవిని తలపించేలా ఎండల తీవ్రత ఉండడంతో నేల పొడిబారిపోయింది. సాగులో ఉన్న వరి పొలాల్లో నేల బీటలు వారింది. మోటార్లతో ఎంత నీరు పొలాలకు పంపుతున్నా పొడి వాతావరణం కారణంగా పంట ఎదగడం లేదు.పెట్టుబడులు పెట్టిన రైతులు పంటలు కాపాడుకోవడానికి నానా ఇక్కట్లు పడుతున్న తరుణంలో బుధవారం యలమంచిలి ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో పంటలకు జీవం వచ్చినట్టయిందని రైతులు చెబుతున్నారు. భారీ వర్షంతో యలమంచిలి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నీరు చేరడంతో చెరువులా మారింది. క్రీడాకారులు మరో రెండు,మూడు రోజుల వరకు సాధన చేయలేని విధంగా మైదానం చిత్తడిగా తయారైంది. పలు వీధుల్లో రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో జనం రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.


