యలమంచిలి రూరల్: మండలంలోని మర్రిబంద సమీపంలో పోలవరం ఎడమ ప్రధాన కాల్వలో సోమవారం ప్రమాదవశాత్తూ జారి పడి గల్లంతైన మర్రిబంద గ్రామానికి చెందిన కంచు అప్పలనాయుడు మృతదేహం మంగళవారం గల్లంతైన ప్రదేశానికి దగ్గరలోనే నీటిలో తేలింది. మృతుడి తమ్ముడు కంచు సన్యాసిరావు గ్రామస్తుల సహకారంతో అన్న అప్పలనాయుడు మృతదేహాన్ని కాలువలోంచి బయటకు తీశారు. ఈ మేరకు యలమంచిలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యక్తి అదృశ్యం కేసును నీట మునిగి చనిపోయిన కేసుగా సెక్షన్లు మార్పు చేసినట్టు ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. శవ పంచనామా, పోస్టుమార్టం అనంతరం అప్పలనాయుడు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఉపాధి పనులకు వెళ్లి వస్తూ పోలవరం కాలువ వద్ద కాళ్లు, చేతులు, ముఖం కడుగుకోవడానికి ప్రయత్నించిన అప్పలనాయుడు ప్రమాదవశాత్తూ కాల్వలో జారిపడి మృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


