అనకాపల్లి: ఎల్నినో కారణంగా వర్షపాతం అనిశ్చితంగా మారుతున్న నేపథ్యంలో రైతులు వాతావరణ సూచనలను నిరంతరం గమనిస్తూ, వాటికి అనుగుణంగా వ్యవసాయ పనులు చేపట్టాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (ఆర్ఏఆర్ఎస్) అధికారి సీహెచ్.ముకుందరావు సూచించారు. మంగళవారం స్థానిక ఆర్ఏఆర్ఎస్ కార్యాలయంలో శాస్త్రవేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పొడి వాతావరణం, తగినంత వర్షపాతం లేకపోవడం వల్ల వరి, మొక్కజొన్న, రాగి, కంది, వేరుశనగ, కూరగాయ పంటలు వడులుతున్న పరిస్థితుల్లో పంటలను తేమ ఒత్తిడి నుంచి కాపాడేందుకు సాధ్యమైనంత వరకు ప్రాణరక్షక నీటి తడులు అందించాలని సూచించారు. నీటిపారుదల సౌకర్యం లేని ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో 19:19:19 లేదా మల్టీ–కే ద్రావణాన్ని లీటరు నీటికి 5 నుంచి 10 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు. గడ్డి, వెడల్పాటి ఆకుల కలుపు మొక్కలు అధికంగా ఉన్నప్పుడు బిస్పైరాబాక్ సోడియంను ఎకరానికి సుమారు 100 మి.లీ లేదా ట్రైఫ్లోమోన్ ఇథాక్సిసల్ఫ్యూరాన్ను ఎకరానికి 90 గ్రాములు చొప్పున పిచికారీ చేయాలన్నారు. వరి పంటలో కాండం తొలిచే పురుగు, ఆకు ముడత పురుగుల వ్యాప్తిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వి.గౌరీ, ఎం.విశాలాక్షి, పి.వి.పద్మావతి, ఎన్.భారతీ, ఎ.అలివేణి, తదితరులు పాల్గొన్నారు.


