మునగపాక: భర్తకు భార్య తలకొరివి పెట్టిన ఘటన మునగపాకలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మునగపాక గ్రామానికి చెందిన ఆడారి శ్రీనివాసనాయుడు(54) గతంలో విలేకరిగా పనిచేసేవారు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. అందరితో సరదాగా మెలిగే శ్రీనివాసరావు మరణ వార్త తెలియడంతో గ్రామంలో విషాదం అలముకుంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. కాగా శ్రీనివాసరావు అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. అయితే శ్రీనివాసరావుకు కుమారులు లేకపోవడం, అలాగే ఇద్దరు కుమార్తెలు మైనర్లు కావడంతో భార్య వెంకటలక్ష్మి తలకొరివి పెట్టి భర్త రుణం తీర్చుకుంది. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. శ్రీనివాసరావు భార్య వెంకటలక్ష్మి స్థానిక వెలుగు కార్యాలయంలో అకౌంటెంట్గా పనిచేస్తున్నారు.


