కశింకోట: జాతీయ పురస్కారం సాధించేందుకు అవసరమైన అన్ని అర్హతలు మండలంలోని జి. భీమవరం పంచాయతీకి ఉన్నాయని పంచాయతీరాజ్ అదనపు డైరెక్టర్ డి.మల్లేశ్వరి తెలిపారు. ఈ పంచాయతీని జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపిక చేసిన నేపథ్యంలో మంగళవారం ఆమె గ్రామాన్ని సందర్శించి, అధికారులు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నపాటి లోపాలను సరిదిద్దుకుని పురస్కారం సాధించాలని, ఇతర పంచాయతీలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం పంచాయతీ రికార్డులు, మౌలిక వసతులు, సిబ్బంది పనితీరును సమగ్రంగా పరిశీలించారు. స్వర్ణపంచాయతీ సిబ్బంది విధులను కూడా సమీక్షించారు. పంచాయతీలో ప్రజలకు అందుతున్న సేవలు, కనీస సౌకర్యాలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఐఎస్వో సర్టిఫికేషన్, గుడ్ గవర్నెన్స్ అంశాల్లో భాగంగా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సిహెచ్.చంద్రశేఖర్రావు, డిప్యూటీ ఎంపీడీవో వెంకటలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


