సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని మంగళవారం అలనాటి సినీ బాలనటి, జాతీయ అవార్డు గ్రహీత బేబి రాణి (రాణి రుద్రమదేవి) కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ఆమె పేరిట అర్చకులు అష్టోత్తర పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను అధికారులు ఆమెకు అందించారు. ఈ సందర్భంగా బేబి రాణి మాట్లాడుతూ బాలనటిగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం తదితర భాషల్లో 90కిపైగా చిత్రాల్లో నటించినట్లు తెలిపారు. అప్పటి ప్రముఖ తెలుగు నటులు నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, కృష్ణ, శోభన్బాబు, జగ్గయ్య తదితరులతో కలిసి పలు చిత్రాల్లో నటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 1968, 1969 సంవత్సరాల్లో జాతీయ అవార్డులు అందుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని బేబి రాణి తెలిపారు.


