పాయకరావుపేట: పట్టణంలో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలంటూ సోమవారం మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో పొర్లుదండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా నివాసముంటున్న పేదలకు ప్రభుత్వం తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ జిల్లా నాయకుడు ఎం.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణంలో చాలా కాలంగా నివాసముంటున్న పేదలకు ఇప్పటికీ ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడం అన్యాయమని విమర్శించారు. గత కొన్ని రోజులుగా ఇళ్ల స్థలాల కోసం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే స్పందించి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో పార్టీ కార్యకర్తలు, బాధిత కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


