కానరాని వర్షాలు
ఎల్నినో ప్రభావం రోజురోజుకూ
తీవ్రమవుతోంది. వర్షాభావం,
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తదితర
ప్రతికూల పరిస్థితులతో నాట్లు ఎండి
పోతుండడంతో అన్నదాతలు ఆందోళన
చెందుతున్నారు. సెప్టెంబరులో అయినా
వరుణుడు కరుణిస్తాడేమోనని కాస్త
ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు.
పది రోజుల్లో వర్షాలు కురవకపోతే
ఆశలు వదులుకోవాల్సిందేనని
రైతులు వాపోతున్నారు.
పెదకిల్తారిలో జాతీయ రహదారి పక్కనే నీరు లేక ఎండిపోతున్న వరి నాట్లు
సాక్షి, పాడేరు: ఈ ఖరీఫ్ సీజన్లో మొదటి నుంచి గిరి రైతులకు కష్టాలు తప్పడం లేదు. నాట్లు వేశాక వర్షాలు అనుకూలించకపోవడంతో ఎండిపోతున్నాయి. నీరు లేక వర్షాల కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబరు నెల వచ్చి వారం అయిపోతున్నా అయోమయ పరిస్థితి నెలకొంది. ఏడాదికి రెండు పంటలు సాగు చేసే జి.మాడుగుల మండలం వంజరి పంచాయతీ ఘాట్ దిగువ గ్రామాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. పెదకిల్తారి, చినకిల్తారి, కృష్ణాపురం తదితర గ్రామాల్లోని సుమారు 100 ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి దాపురించింది. తమ కళ్లముందే వరినాట్లు నాశనమవుతుండడంతో గిరిజన రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. తాజంగి మినీ రిజర్వాయర్ను ఆనుకుని ఎగువన ఉన్న పంట భూములకు సాగునీటి సమస్య నెలకొంది. మోటార్లు ఉన్నవారు తాజంగి రిజర్వాయర్ నీటిని మడులకు మళ్లిస్తున్నారు. పెదకిల్తారి రైతులు కొండ నుంచి ప్రవహిస్తున్న ఊటనీటిని జాతీయ రహదారి దిగువన ఎండిపోతున్న వరి భూములకు మళ్లించేందుకు పంట కాల్వలను తవ్వుకుంటున్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో జిల్లాలోని 11 మండలాల పరిధిలో ఆశించినంత వర్షాలు పడలేదు. ఇక్కడ వర్షాధారంపైనే వరితో పాటు ఇతర చిరుధాన్యాలు, వాణిజ్య పంటలు, కూరగాయల సాగు చేస్తారు. సాధారణ వరిసాగు విస్తీర్ణం 41,608 హెక్టార్లు కాగా, ఇప్పటివరకూ 34,667 హెక్టార్లలో మాత్రమే అతికష్టం మీద వరినాట్లు పడ్డాయి. అయితే నాట్లు వేసిన తరువాత కూడా వర్షాలు కురవకపోవడంతో అవి ఎండిపోతున్నాయి. 20 శాతం లోతట్టు భూముల్లో పంట ఎదుగుదలకు ఇబ్బంది లేనప్పటికీ, మిగిలిన 80 శాతం భూముల్లో నాట్లు ఎండిపోతున్నాయి.


